బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానిని కలిసిన దాంట్లో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని సూచించారు. భవిష్యత్తులోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గతంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే కేసీఆర్ ఓ దొంగల దాక్కున్నాడని ఫైర్ అయ్యారు. కనీసం రాష్ట్ర ప్రయోజనాలు, వచ్చే నిధుల గురించి కూడా ఆలోచన చేయలేదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కరీంనగర్ పూర్తిగా ఆర్థికంగా దోపిడీకి గురైందన్నారు. మళ్లీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్లో సభ పెడుతున్నాడని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీకి దోస్తీ ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆప పార్టీతో తమకు పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బూటకపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా మభ్యపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకు వారికే క్లారిటీ లేదని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.