కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ పార్లమెంటరీ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులను రద్దు చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేతన్నలను ఆదుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయలేదని, రైతుబంధు వేయలేదని చెప్పారు. ఎల్ఆర్ఎస్పై రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు పిలుపినిచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని, డిసెంబర్ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ మాట తప్పారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని తెలిపారు.
నియోజకవర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు రద్దు చేయడం కాదని, నీకు దమ్ముంటే, చేతనైతే ప్రజల మనసు గెలుచుకోవాలని సూచించారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు తాను రెండు లేన్ల రోడ్డు మంజూరు చేశానని, నీకు చేతనైతే ఆ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చి ప్రజల మనసును గెలుచుకోవాలని అన్నారు. తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నల కొంప పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం వేస్ట్ అంటున్నారన్నారు. కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో దివాళా, దగుల్బాజీ రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వ్యాఖ్యానించారు. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని, మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు. అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో కదన భేరి బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.