కొన్ని గంటల్లో అనంత్, రాధిక పెళ్లి
తరలివస్తున్న దేశ, విదేశీ ప్రముఖులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబంతోపాటు దేశ, విదేశీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక–అనంత్ అంబానీ డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి వేడుకలు ఈ నెల 1నుంచి 3 వరకు గుజరాత్లోని జూమ్నగర్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వివాహ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు వస్తున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లి వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఏకంగా 2500 రకాల వంటకాలను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం దేశ నలువైపుల ఉన్న 30మంది బెస్ట్ చెఫ్లను రప్పించినట్లు తెలుస్తోంది.
ఈ వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈవెంట్కు తగ్గట్టు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అతిథులను ఆకట్టుకునేలా ఉంది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్, తన సతీమణి ప్రిసిల్లా చాన్, ఈశా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్, బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె–రణ్వీర్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్– పారుపల్లి కశ్యప్, కియారా అడ్వాణీ, స్టార్ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీ దంపతులు పాల్గొని సందడి చేశారు. సెలబ్రిటీస్ అంతా బ్లాక్ అవుట్ఫిట్స్లో మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.