నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన సమ్మక్క – సారలమ్మ జాతర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 518 హుండీలను ఏర్పాటు చేయగా వాటిని లెక్కించేందుకు హనుమకొండలోని టీటీడీ కళ్యాణమండపానికి తీసుకువస్తారు. లెక్కింపు కార్యక్రమం దాదాపు 10 రోజులపాటు జరగనుంది. డబ్బులు లెక్కిస్తున్న సమయంలో లభించిన కరెన్సీని అధికారులు అవాక్కయ్యారు. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటోకు బదులు డా.బిఆర్.అంబేడ్కర్ ఫొటో ఉండంతో అందరూ ఆశ్చర్యపోయారు.
మొదట ఓపెన్ చేసిన హుండీలలో నకిలీ కరెన్సీ లభ్యమయ్యాయి. అయితే బీఆర్.అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన నకిలీ వంద రూపాయల నోట్లు బయటపడ్డాయి. కాగా.. అంబేడ్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలన్న డిమాండ్లు వస్తున్న తరుణంలో ఈ విషయాన్ని జనం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు.. 2020జాతర సమయంలో 11 కోట్ల 17 లక్షల రూపాయలు, 2022 కరోనా సమయంలో 10 కోట్ల 91 లక్షల రూపాయలు వచ్చాయి.