ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి మార్చి 4న విచారణకు రావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కి ఈడీ సమన్లు ఇవ్వడం ఇది ఎనిమిదో సారి. ఏడోసారి ఇచ్చిన నోటీసులకు గడువు ముగిసిన మరుసటి రోజునే మరోసారి సమన్లు జారీ కావడం గమనార్హం. అయితే ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి నవంబర్ 2న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మొదటిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులను పంపిస్తున్నప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరు కావడం లేదు. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్న తరుణంలో ఈడీ నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఇలా పదే పదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని ఈడీని ఆప్ కోరింది. ఇప్పటికే ఏడుసార్లు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్ తాజాగా వచ్చిన నోటీసులపై ఏం చేస్తారో వేచి చూడాలి.
