ఉత్తర్ప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు కొనసాగించవచ్చని అలహాదాబ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సోమవారం అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. అయితే హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతే జామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అనంతరం అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఇవాళ తీర్పును వెలువరించారు. జిల్లా కోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని తేల్చిచెప్పింది.
దీంతో మసీదులో పూజలపై ముస్లిం పక్షానికి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఈ ప్రార్థనా మందిరం సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన సర్వే నివేదిక ఆధారంగా అక్కడ హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నట్లు వారణాసి కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలో ఆ రెండు ఉత్తర్వులను మసీదు కమిటీ హైకోర్టులో సవాల్ చేసింది. వ్యాజ్యంపై ఫిబ్రవరి 15న విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి తాజాగా తీర్పు వెలువరించింది.