వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తి ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
