పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని గద్దె గించేందుకు ఇండియా కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్లు ఖరారు అయ్యాయి. ఎన్నికల్లో కలిసి వెళ్లేందుకు గత కొన్ని రోజులు చర్చలు జరిగిన క్రమంలో ఈ రెండు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. ఢిల్లీ సహా హర్యానా, చండీగఢ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఢిల్లీలో పాలక ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇందులో ఆప్ న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో పోటీ చేయనుంది. అలాగే చాందిని చౌక్, వాయువ్య ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ బరిలో నిలువనుంది. అదే విధంగా గుజరాత్, గోవా, హర్యానా రాష్ట్రాల్లోనూ పొత్తుపై నేతలు చర్చించినట్లు తెలిసింది. గుజరాత్లో 2 లోక్సభ స్థానాల్లో ఆప్.. 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి సిద్ధమయ్యాయి. హర్యానాలో1 స్థానంలో ఆప్, 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. పంజాబ్లో మొత్తం 13 స్థానాల్లో ఆప్ బరిలో దిగుతుందని ఆప్ రెడీ అయ్యింది. గోవా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి.