పార్లమెంట్ సమావేశాల చివరిరోజు సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ‘17వ లోక్సభ’ తీసుకున్న కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలను గుర్తు చేశారు. ఆర్టికల్ 370 నుంచి మహిళా బిల్లు (2023) దాకా.. ఈ సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. తమ ఎన్డీఏ ప్రభుత్వ మంత్రం ‘‘రీఫార్మ్ (సంస్కరణ), పెర్ఫామ్ (పనితీరు), ట్రాన్స్ఫామ్ (పరివర్తన)’’ అని నొక్కి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ల నిషేధం వంటి వాటిని ప్రస్తావిస్తూ.. కొన్ని తరాలుగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయాలను 17వ లోక్సభ తీసుకుందని, గేమ్ ఛేంజింగ్ సంస్కరణల్ని తీసుకొచ్చామని అన్నారు. 17వ లోక్సభ ప్రోడక్టివిటీ 97 శాతం ఉందని, దీని కాలంలో 30 బిల్లులు ఆమోదించబడ్డాయని చెప్పారు. తాను ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’పై నమ్మకం ఉంచుతానని చెప్పిన ఆయన.. బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజలకు సామాజిక న్యాయం తీసుకొచ్చిందని, కఠినమైన చట్టాల ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొందని పేర్కొన్నారు.
ఇంకా ప్రధాని మోదీ ఏం మాట్లాడరంటే..
* ఈ ఐదేళ్లు రీఫార్మ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్కు సంబంధించినవి. రీఫార్మ్, పెర్ఫామ్.. ఈ రెండూ జరగడం చాలా అరుదు. ఇక ట్రాన్స్ఫార్మేషన్ని మనం కళ్లతో చూడగలుగుతున్నాం. 17వ లోక్సభ సాధించిన విజయాల పుణ్యమా అని దేశం ఈ అనుభవాల్ని ఆస్వాదిస్తోంది. 18వ లోక్సభ కూడా ఇంతే దృఢంగా సాగుతుందని నేను ఆశిస్తున్నాను.
* గత కొన్ని తరాల నుంచి ఎదురుచూస్తున్న అనేక నిర్ణయాలను ఈ లోక్సభ కాలంలో తీసుకోవడం జరిగింది. ఈ కాలంలో ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. ఫలితంగా.. జమ్ముకశ్మీర్ ప్రజలకు సామాజిక న్యాయం అందించాం. మేము తీవ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించాము.
* కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన గురించి మాట్లాడేటప్పుడు.. ప్రజల జీవితాల నుంచి ప్రభుత్వం దూరంగా ఉండాలని నేను నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే.. అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. గత ఐదేళ్లలో బలమైన భారత్కి పునాది వేసే గేమ్ ఛేంజింగ్ సంస్కరణలు జరిగాయి.
* బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చిన శిక్షాస్మృతితో (పీనల్ కోడ్) 75 ఏళ్లు బతికాం. ఈ 75 ఏళ్లు మనం కొత్త తరానికి శిక్షాస్మృతి కింద జీవించామని చెప్పుకోవచ్చు కానీ.. రాబోయే తరం న్యాయ సంహితతోనే జీవిస్తుందని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం.
* మహిళా రిజర్వేషన్ బిల్లుని మా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రాన్స్జెండర్లతో సహా అట్టడుగున ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాం. మా ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు పద్మ అవార్డులు కూడా ఇచ్చింది. గత ఐదేళ్లలో శతాబ్దపు అతిపెద్ద సంక్షోభమైన కరోనా మహమ్మారిని కూడా చూశాం.
* రాబోయే 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యమైనవి. రాజకీయ కార్యకలాపాలు యథావిధిగా ఉండొచ్చేమో గానీ.. ఈ 25 సంవత్సరాల్లో దేశం తప్పకుండా ఆశించిన ఫలితాలను సాధిస్తుంది.









