గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. యధాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదాండరాం, అమీరుల్లా ఖాన్లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు రాగా.. యధాతథంగా కొనసాగించాలంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి హైకోర్టు వాయిదా వేసింది.
