హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMAను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. లావణ్య టాలీవుడ్కి చెందిన ఓ హీరో ప్రియురాలిగా తేలింది. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏ హీరో ప్రియురాలో తేల్చేపనిలో ఉన్నారు పోలీసులు.
గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మోకిల పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం లావణ్యను రిమాండ్కు తరలించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ నివారణపై ఫోకస్ పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠినచర్యలు తీసుకుంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో ఎవరెవరి హస్తం ఉందో విచారణలో ఏ తేలుస్తారో అన్నది ఆసక్తిగా మారింది.