AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాగోరే నాగోబా.. హస్తినమడుగు నుంచి కదిలిన శ్వేతనాగుల దండు..

నాగశేషుడిని పూజించే మెస్రం వంశీయుల అతిపెద్ద జాతర నాగోబా ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కెస్లాపూర్ ఆలయం నుండి ప్రారంభమైన గంగా జల సేకరణ మహా పాదయాత్ర హస్తినమడుగుకు చేరింది. నిమయ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో శ్వేత నాగులా కదిలి‌ మెస్రం వంశీయులు గోదావరిలోని హస్తినమడుగుకు చేరుకుని పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరించారు. అమావాస్య అర్థరాత్రి నాగశేషుడికి ఈ పవిత్ర గంగాజలాన్ని అభిషేకించడంతో ఫిబ్రవరి 9 న నాగోబా మహా జాతర ప్రారంభం కానుంది. ఐదు మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాల మీదు సాగుతున్న మెస్రం వంశీయుల గంగాజల మహా పాదయాత్రపై టీవి9 స్పెషల్ రిపోర్ట్.

శ్వేత నాగులా కదిలే రూపం.. తెల్లని వస్త్రం.. దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా పదిరోజుల పాటు సాగుతున్న మహా పాదయాత్ర.. చూసేందుకు రెండు కనులు చాలవు అన్నట్టుగా మంత్ర ముగ్దులను చేస్తోంది. అదే మేస్రం వంశీయుల గంగాజల సేకరణ మహా పాదయాత్ర. ఈనెల 21 కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. 110 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగుకు చేరుకుంది. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగా జలాన్ని సేకరించారు మెస్రం వంశీయులు. కాలికి పాదరక్షలు ధరించకుండా.. అత్యంత నియమనిష్టలతో సాగే ఈ గంగా జల పాదయాత్ర ఈనెల 5 న ఇంద్రవెల్లిలోని ఇంద్రదేవి ఆలయానికి చేరుకోనుంది. ఇంద్రాయి దేవత పూజ అనంతరం సకుటుంబ సపరివార సమేతంగా కెస్లాపూర్ లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు మేస్రం వంశీయులు. ఈ ఘట్టంతో నాగోబా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ప్రతి ఏడాది పుష్యమాస ఆరంభం నుండి ప్రారంభమయ్యే నాగోబా జాతర వేడుకలు.. మేస్రం వంశీయులకే కాదు ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది.

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. పుష్యమాస అమావాస్య అర్థరాత్రి వేళ నాగశేషుడికి గంగాజలాభిషేకంతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని గిరిజన మెస్రం వంశీయుల అపార నమ్మకం. పుష్య మాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల విశ్వసిస్తారు.

ANN TOP 10