– నేడే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ
– ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధం
– లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
– దేశమంతటా భక్తి భావం.. పండుగ వాతావరణం
ప్రపంచం అంతా అయోధ్యవైపే చూస్తోంది. అందరి నోటా సకల గుణాభిరాముడు నడయాడిన నేల ‘అయోధ్య’ మాటే.. శ్రీరాముని కోసం కన్న కలలు సాకారమయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు శ్రీరాముడిని దర్శించుకుందామా అనే ఆత్రుత, భక్తి భావన అందరిలోనూ పెరుగుతోంది. సోమవారం జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అయోధ్యలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా తిలకించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అయోధ్యకు చేరుకునేందుకు దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
మోదీ దీక్ష..
మరోవైపు ప్రధాని మోదీ 11 రోజుల దీక్ష నేటితో ముగియనుంది. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు మోదీ. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిని సందర్శించారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా భావించే అరిచల్ మునైనిలో నరేంద్ర మోదీ పర్యటించారు. రామేశ్వరం అగ్ని తీర్థం బీచ్లో స్నానమాచరించారు.
శ్రీరాముని పేరు వినగానే భక్తుల మనసు పులకిస్తుంది. కోదండ రాముని పేరు తలుచుకుంటే కోటి కష్టాలు మాయమవుతాయని హిందువులు భావిస్తారు. పురాణాల ప్రకారం.. నిజాయితీకి, నీతిమంతమైన పాలనకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. మనిషికి ఉండాల్సిన సద్గుణాలకు పోలికగా రాముడిని తప్ప మరే దేవుడిని ఉదహరించలేం. సకల జనులకు రాముడే ఆదర్శం. జగదభి రాముడు జన్మించిన పవిత్ర భూమి అయోధ్య. సకల మానవాళికి జీవన నడవడిని నేర్పిన వేదభూమి అయోధ్య.
జగదానంద కారకుడి ప్రాణ ప్రతిష్ఠ దగ్గరపడిన వేళ జగమంతా రామమయమైంది! రామ నామ స్మరణతో అయోధ్యతో పాటు దేశమంతా భక్తిభావంతో నిండిపోయింది. దేశ విదేశాల నుంచి విలువైన, అపురూపమైన కానుకలు రామయ్య సేవ కోసం తరలివచ్చాయి. విద్యుత్ కాంతులు, సహజ సుందరమైన పుష్పాలంకరణలతో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి అందంగా ముస్తాబైంది. అలంకరణలతోపాటు సంప్రదాయం ఉట్టిపడుతూ, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాల కాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రాణ ప్రతిష్ఠ పూజలో 14 మంది దంపతులు
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ పూజలో ‘యజమానులు’గా సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయం నిర్మాణం కోసం అన్ని ప్రాంతాలవారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి యజమానుల ఎంపిక జరిగింది.
రామాలయం వద్ద బుకింగ్..
రామాలయానికి వెళ్లిన రోజునే దర్శనం, హారతి కోసం బుక్ చేసుకోవచ్చు. అయితే స్లాట్ లభ్యతనుబట్టి పాస్ ఇస్తారు. హారతి షెడ్యూలు సమయానికి 30 నిమిషాల ముందు భక్తులు క్యాంప్ ఆఫీస్ వద్ద హాజరుకావాలి. హారతి పాస్లను పొందడం కోసం ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఐడీ కార్డులను చూపించాలి.
ఆహ్వాన పత్రిక ఉన్నా ఎంట్రీ పాస్ తీసుకోవాల్సిందే
బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక ఉన్నవారు తప్పనిసరిగా ఎంట్రీ పాస్ను తీసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఆహ్వానితులకు వాట్సాప్ ద్వారా ఓ లింక్ను పంపించినట్లు తెలిపింది. ఫిజికల్ ఎంట్రీ పాస్ ప్రింట్ చేసి ఇస్తామని తెలిపింది. దీని కోసం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను ఉపయోగించాలని చెప్పింది.
ప్రసాదం ఏమిటంటే..
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్పెషల్ తెప్లా(చపాతీలు), బాదం మిఠాయిలు, మటర్ కచోరీ వంటివాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. హైదరాబాద్కు చెందిన ఎన్. నాగభూషణం రెడ్డి సమర్పించిన 1,265 కేజీల లడ్డూలను కూడా ప్రసాదంగా అందజేస్తారు.
అత్యంత ఖరీదైన రామాయణ గ్రంథం
బుక్ సెల్లర్ మనోజ్ సతి ప్రత్యేక శ్రద్ధతో వాల్మీకి రామాయణం గ్రంథాన్ని ముద్రించి అయోధ్యలో అమ్మకానికి పెట్టారు. దీని ఖరీదు రూ.1.65 లక్షలు అని ఆయన చెప్పారు. దీనిని మూడు పెట్టెల్లో పెట్టి ఇస్తామన్నారు. ఈ పెట్టెలు రామాలయాన్ని పోలి ఉంటాయన్నారు. ఫ్రాన్స్లో తయారైన కాగితం, జపాన్ నుంచి తెప్పించిన సిరాతో దీనిని ముద్రించామన్నారు. అమెరికన్
వాల్నట్ వుడ్, కుంకుమ పువ్వుతో డిజై¯Œ చేశామన్నారు. 45 కేజీల బరువు గల ఈ పుస్తకం 400 సంవత్సరాలకుపైగా మన్నుతుందని చెప్పారు.
ఎక్కడ చూసినా రామాలయం చిత్రాలే..
అయోధ్యలో బ్యాంకులు, వ్యాపార సంస్థలు సైతం ఆధ్యాత్మిక భావాన్ని పంచుతున్నాయి. రామాలయం చిత్రాలతో భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. రామ్ పథ్లో ప్రారంభమైన ఓ బ్యాంకును రామ జన్మభూమి శాఖగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కూడా తమ విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్లు రామాలయం బొమ్మను ముద్రించాయి. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన పోస్టర్లో ‘ప్రభు శ్రీరాముని పావన నగరానికి స్వాగతం’ అని రాశారు. సాధారణ ప్రజానీకం కూడా తమ మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లుగా రాముని పాటలనే పెట్టుకుంటున్నారు.









