రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే పట్టణాలు ఖాళీ చేసిన ప్రాజానికం పల్లెబాట పట్టింది. ఇందులో భాగంగా భాగ్యనగర వాసులు పల్లె వైపు పరుగులు తీశారు. పండగను ఆత్మీయుల మధ్య జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో నేడు భోగీ మంటలతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. సంక్రాంతి ముగ్గులకు ఇళ్లు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ రోడ్లు మరోసారి బోసిపోయి కనిపించాయి! పట్టణాలు విడిచిన ప్రజలు పల్లెకు చేరుకున్నారు. పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. ఇంతకాలం ఏమి మిస్సయ్యారో తెలుసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ సగం ఖాళీగా కనిపిస్తోంది.
ఎప్పుడు బిజీ బిజీగా ఉండే భాగ్యనగరం రోడ్లన్ని ఖాళీగా దర్శనిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే వినిపించకపోవడం గమనార్హం. వాస్తవానికి.. సాధారణంగా దసరా పండక్కి, బతుకమ్మ సమయంలోనూ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఊర్లకు వెళ్తుంటారు. అయితే… సంక్రాంతికి మాత్రం అటు తెలంగాణ జిల్లాలకు చెందినవారితో పాటు ఇటు ఆంధ్రా వారు ఆల్ మోస్ట్ మొత్తం అన్నట్లుగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ రోడ్లు మొత్తం బోసిపోయి కనిపిస్తుంటాయి. ప్రస్తుతం సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయిందన్న అతిశయోక్తి కాదు! సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు, పల్లె గాలి పీల్చేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు, చిన్ననాటి సంగతులను నెమరువేసుకునేందుకు ప్రజలంతా పల్లెలకు వెళ్లారు. సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం పుష్కలంగా ఉంది.









