AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

TSPSC ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఇటీవల కమిషన్ ఛైర్మన్ పదవికి జనార్ధన్ రెడ్డి సహా, సభ్యులు రాజీనామా చేయగా.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. కాసేపటిక్రితం వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌదరరాజన్‌కు పంపించారు. గతేడాది టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల పేపర్లు లీక్ కావటం.. ఫలితంగా కొన్ని రద్దవటం, మరికొన్ని వాయిదాలు పడటంతో నియామక ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్సీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని.. బోర్డునే మార్చేయాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. జనార్ధన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. అయితే గవర్నర్ వారి రాజీనామాలకు ఆమోదం తెలపకుండా హోల్ట్‌లో పెట్టారు. పేపర్ లీక్ ఘటనపై క్లారిటీ ఇచ్చాకే వారి రాజీనామాలకు ఆమోదం తెలపాలని గవర్నర్ భావించారు. అయితే.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు.

టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. నెలరోజులుగా ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదించలేదని.. ఇలా అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుందన్నారు. ఛైర్మన్‌ లేకపోవడం వల్ల పరీక్షల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు వారి రాజీనామాలు ఆమోదించాలని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా వారి రాజీనామాలను ఆమోదిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త కమిషన్ ఏర్పాటు, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లైంది. కమిషన్ ఏర్పాటు తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ANN TOP 10