AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నగరంలో విషాదం.. భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువై భర్త హఠాన్మరణం పాలవడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయి చివరికి ఉసురు తీసుకుంది. మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రహీంపురాకు చెందిన అమన్‌కుమార్‌ సింగ్ ‌(36), అప్పర్‌ ధూల్‌పేట ఆరాంఘర్‌ కాలనీకి చెందిన అస్మిత (31) భార్యాభర్తలు. వీరికి రోనక్‌, రిత్విక్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గచ్చిబౌలిలో ప్రైవేటు ఉద్యోగం చేసే అమన్‌కుమార్‌ సింగ్‌ గత నెల 26న రాత్రి ఒక్కసారిగా బీపీ ఎక్కువై బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతిచెందాడు.

అప్పటి నుంచి 15 రోజులుగా అస్మిత మానసిక వేదనను అనుభవించింది. భర్త ఫొటోను దగ్గర పెట్టుకొని బాధపడింది. చివరికి మనస్తాపంతో మంగళవారం సాయంత్రం ఆరాంఘర్‌ కాలనీలోని పుట్టింట్లో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10