ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి తన కుమారుడి పెండ్లికి ఆహ్వానించారు. ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, పిబ్రవరి 17వ తేదీన పెండ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి పెండ్లి పత్రికను అందిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు పత్రికను అందించారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్లో కలిసి కొడుకు పెండ్లి పత్రికను అందించి… ఆహ్వానించారు. తన కొడుకు పెండ్లికి తప్పకుండా రావాలని కోరారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.
