ఢాకా: భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టం అని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారతీయులు తమకు అండగా ఉన్నారని చెప్పారు. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం (Democracy) ఎంతో కీలకమని తెలిపారు. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని షేక్ హసీనా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సార్వభూమ, స్వాతంత్య్ర దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. అది సజావుగా కొనసాగాలని కోరుకుంటున్నా. లేదంటే దేశాభివృద్ధి సాధ్యం కాదు. 2009 నుంచి 2023 వరకు తాము అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్ ఈ స్థాయికి చేరుకుంది. ప్రజలు నిర్భయంగా ఓటువేసే వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా భారత్కు ధన్యవాదాలు తెలిపారు.
భారత్వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండటం తమ అదృష్టమని చెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో తమకు అండగా ఉన్నారని తెలిపారు. 1975 తర్వాత మా కుటుంబాన్ని మొత్తం కోల్పోయినప్పుడు మాకు ఆశ్రయమిచ్చారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1975లో జరిగిన పోరులో హసీనా తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయారు. దీంతో ఆమె చాలా కాలంపాటు భారత్లో జీవించారు. అనంతరం బంగ్లాదేశ్కు వెళ్లిన హసీనా.. అవామీ లీగ్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు.
కాగా, ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)పై ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని టెర్రరిస్టులతో పోల్చారు. ఆ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులని విమర్శించారు. ఎన్నికలను బహిష్కరించడమే కాకుండా దేశంలో హింసను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం కొనసాగాలని వారికిలేదన్నారు.