యూనివర్సిటీ క్యాంపస్లో భవనం ఐదో అంతస్తు నుంచి కిందపడి 18 ఏళ్ల ఓ యువతి దుర్మరణం పాలైంది. అందరూ చూస్తుండగానే ఐదో అంతస్తులో పిట్ట గోడ పైకి ఎక్కి కిందకు దూకేసింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. కింద ఉన్న కొంత మంది విద్యార్థులు గట్టిగా కేకలు వేస్తున్నా.. అమ్మాయి ఒక్కసారిగా కిందకు దూకేసింది. యువతి రేణుశ్రీ.. గీతం యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో శుక్రవారం (జనవరి 5) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థినిని రేణుశ్రీ (18)గా గుర్తించారు. యూనివర్సిటీ క్యాంపస్లోని ఓ భవనం ఐదో అంతస్తు పిట్టగోడ పైకి రేణుశ్రీ ఎక్కుతుండగా.. కింద నుంచి గమనించిన కొంత మంది విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. విద్యార్థులు కేకలు వేస్తుండగానే.. రేణుశ్రీ కిందకు దూకేసింది. ఈ క్రమంలో భవనం గోడకు ఢీకొని, కింద సైతం గోడకు ఢీకొని దుర్మరణం పాలైంది.
విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ.. తలకు బలమైన గాయమై, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. రేణుశ్రీ కిందకు దూకుతున్న దృశ్యాలను కొంత మంది విద్యార్థులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ భయానక ఘటనతో యూనివర్సిటీ క్యాంపస్లో ఒక్కసారిగా అలజడి రేగింది. రేణుశ్రీ తల్లిదండ్రులు కూకట్పల్లిలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణలు తెలియాల్సి ఉంది. రేణుశ్రీ కింద పడుతుండగా చూసిన విద్యార్థులను పోలీసులు విచారించారు. కాలేజీ సిబ్బందిని కూడా విచారించి వివరాలు సేకరించారు. రేణుశ్రీది ఆత్మహత్య కాకపోవచ్చునని, ప్రమాదవశాత్తూ కింద పడి ఉండొచ్చునని కొంత మంది చెబుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.









