2023లో పెరిగిన క్రైం రేటు
అన్నిట్లో సైబర్ నేరాల కేసులే ఎక్కువ
విస్తుపోయేలా వార్షిక నివేదిక
విడుదల చేసిన డీజీపీ రవిగుప్త
2023 సంవత్సరం ముగుస్తున్న వేళ రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదికను ప్రజల ముందుంచారు. గత ఏడాది (2022) కంటే 2023లో క్రైం రేటు పెరిగిందని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని.. పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు సజావుగా సాగయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సందర్భంగా మావోయిస్టుల అలజడి లేకుండా జరిగాయని వివరించారు. అయితే గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 8.97 శాతం క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మొత్తంగా 2,13,121 కేసులు నమోదు చేశామని డీజీపీ పేర్కొన్నారు.
ఈ ఏడాది సైబర్ క్రైం నేరాలు భారీగా పెరిగాయని డీజీపీ తెలిపారు. 2022తో పోలిస్తే 17. 59 శాతం మేర సైబర్ క్రైం నేరాలు పెరిగాయని.. ఈ ఏడాది మొత్తంగా 16339 సైబర్ క్రైం కేసులు నమోదు చేసినట్టు డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది 1108 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు. మొత్తం 73 అత్యాచార కేసుల్లో 84 మంది దోషులకు జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని వివరించారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్ కేసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేశామని.. ఇవి గతేడాదితో పొలిస్తే 15.6 శాతం ఎక్కువ అని తెలిపారు. 2,52,60 కేజీల గంజాయి, 1240 గంజాయి మొక్కలను సీజ్ చేశామని 2583 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి, 182 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపిన డీజీపీ 7.99 కోట్లు సీజ్ చేసినట్టు వివరించారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్ను అరెస్ట్ చేసినట్టు తెలిపిన డీజీపీ 536 మంది డ్రగ్స్ కంజూమర్స్కు కౌన్సెలింగ్ ఇచ్చామని వివరించారు.
మరోవైపు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1877 నమోదు చేశామని డీజీపీ వివరించారు. మహిళలపై వేధింపుల విషయంలో 19013 కేసులు నమోదైనట్టు డీజీపీ వివరించారు. ఇందులో 2284 అత్యాచారం కేసులుండగా 33 వరకట్న హత్యలు, 132 వరకట్న మరణాలు, 9458 వరకట్న వేధింపుల కేసులు, మహిళలు హత్యలు 213 నమోదవగా 884 మహిళ కిడ్నాప్ కేసులు నమోదైనట్టు వివరించారు. ఈ ఏడాది 2426 పొక్సో కేసులు నమోదు కాగా ఒక నిందితుడికి మరణ శిక్ష, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించినట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 20,699 కేసులు నమోదు కాగా.. 6788 మంది మృతి చెందగా.. 19,137 మంది గాయాలబారిన పడినట్టు తెలిపారు డీజీపీ. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువని పేర్కొన్నారు. 287 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమైదు కాగా.. 557 మంది భాదితులను రెస్క్యూ చేసి.. 364 మంది ట్రాఫికర్స్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ ద్వారా 132 జరగ్గా.. అందులో124 తెలంగాణలో, మరో 8 అంతర్రాష్ట్రాల్లో ఆపరేషన్లు నిర్వయించినట్టు డీజీపీ రవి గుప్తా తెలిపారు.