బిగ్బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తైంది. తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ప్రశాంత్ తరపు న్యాయవాది జులకంటి వేణుగోపాల్ కోరారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు జరిగాయన్నారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కు బయట జరిగిన ఉదంతం తెలియదని కోర్టుకు తెలిపారు న్యాయవాది వేణుగోపాల్. బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్నాడు ప్రశాంత్.
ప్రభుత్వ ఆస్తులపై దాడి కేసులో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించగా.. తాజాగా ఇదే కేసులో మరో 16మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు మైనర్లు ఉన్నారు. మిగిలిన 12మందిని వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచనున్నారు.
బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి దిగారని పోలీసులు చెబుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. వాహనాలు ధ్వంసం చేశారు. దాడి చేసిన గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తాజాగా 16 మందిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పల్లవి ప్రశాంత్ ర్యాలీగా వెళ్లాడని, రోడ్డుపై వాహనాలు ఆపాడని, దాంతో అభిమానులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.