AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం.. రాష్ట్రం అప్పులు ఎన్నంటే?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని తెలిపారు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, అందుకే శ్వేతపత్రం ద్వారా వివరాలను వెల్లడించడం జరిగిందని తెలిపారు.

సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. వారి కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం తెలిపింది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతిపట్ల శాసనసభ సంతాపన్ని తెలియజేసింది. ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు.

అనంతరం ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు-శ్వేతపత్రం’ పై స్పీకర్ అనుమతిలో ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క లఘు చర్చను ప్రారంభించారు. దానిపై బీఆర్ఎస్ నుంచి మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడాల్సి ఉంది. అయితే శ్వేతపత్రం ఇప్పుడే ఇచ్చారు కాబట్టి .. దానిపై కొంత సమయం ఇవ్వాలని హరీష్ రావు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించడంతో సభను స్పీకర్ అరగంట వాయిదా వేశారు.

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు..

తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20శాతం అంతరం ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది
2014- 15లో అప్పు 72,658 కోట్లు.. ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది.
2014-15 నుంచి 2022 – 23 మధ్య కాలంలో సగటున 24.5శాతం అప్పు పెరిగింది.
2023- 24 అంచనా ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు.
2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7శాతంతో దేశంలో అత్పల్పం.
57ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98లక్షల కోట్ల వ్యయం.
రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
ఈ పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు
రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34శాతానికి పెరిగింది
రెవెన్యూ రాబడిలో మరో 35శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది.
పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది
విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.

ANN TOP 10