– హామీలన్నీ నెరవేరుస్తాం..
– దేశంలోనే ఆదర్శం కాబోతున్నాం
– పదేళ్ల నిర్బంధ పాలన నుంచి ప్రజలకు విముక్తి
– గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తాం
– గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
– ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగం
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించి, దాశరథి సూక్తులతో ముగించారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నానని గవర్నర్ పేర్కొన్నారు. దాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు. కార్య నిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని వివరించారు.
కీలక అంశాల ప్రస్తావన..
గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అణచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు. గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గత ప్రభుత్వం నిర్వాకంతో..
ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతో పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చామని.. త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉందన్నారు. రూ. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని.. పౌర సరఫరాల శాఖ రూ. 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా యువతకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుతాం అని గవర్నర్ స్పష్టం చేశారు. ఏడాది లోపు మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని, ఆరు నెలల్లో మెగా డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం
రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్రతీ వర్గాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుందన్నారు. యువత జాబ్ క్యాలెండర్ విషయంలో చెప్పిన మాట ప్రకారం కార్యాచరణ ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అసైన్డ్, పోడు భూములకు త్వరలోనే పట్టాల పంపిణీ చేపడుతాం అని గవర్నర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.









