డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్కకు అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలె ప్రజాభవన్ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక మీదట భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్ ఉండనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉండేది. సీఎం హోదాలో కేసీఆర్ అక్కడే ఉంటూ అధికారిక కార్యక్రమాలు నిర్వహించేవారు.
కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ను జ్యోతి రావు పూలె ప్రజాభవన్గా మారుస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను కూడా తొలగించి వేశారు. రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించారు. ఆ తర్వాత ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజాభవన్ను తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసం ఎక్కడ అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.









