తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కారు కసరత్తు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం మంత్రి కొత్త కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
2014వ సంవత్సరం నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 9 ఏళ్లు అవుతోంది. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో పాటు కొందరు తమ పాత కార్డుల్లో కొత్త కుటుంబసభ్యుల పేర్లను చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడిన వారికి రేషన్ కార్డులు లేవు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1.25 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయి.
రాష్ట్రంలో ఉన్న 90.14 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.62 లక్షల కార్డులున్నాయి. అన్నపూర్ణ పథకం కింద 5,21 కార్డులున్నాయి. మహాలక్ష్మి పథకం కిద మహిళలకు రూ.2,500 ఇవ్వాలన్నా, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాలు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా పథకం అందాలన్నా రేషన్ కార్డు అవసరం అవుతుంది. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.