AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్‌లో కీలక మార్పులు.. ! ఇకపై..

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజల సంక్షేమం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యల పట్ల సత్వర పరిష్కారం కోసం కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి ప్రజలు ఇక్కడి వచ్చి తమ సమస్యలను తెలియజేసేందుకు అవకాశం కల్పించారు. అయితే, తాజాగా ప్రజాదర్బార్‌ విషయంలో ప్రభుత్వం పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

గత శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణిగా నామకరణం చేసింది. ఇకపై వారంలో రెండుసార్లు నిర్వహించబడుతుంది. మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ప్రభుత్వం. ప్రజావాణిలో పౌరులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చు.

తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించగా, అధికారులు దరఖాస్తుల స్వీకరణను కొనసాగించారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్‌కు చేరుకునే వారిని తమ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులను కోరారు.

ANN TOP 10