సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు రెండు పథకాలను ప్రారంభించారు. మహా లక్ష్మీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకాలను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది లబ్ది పొందనున్నారు.
మహా లక్ష్మీ పథకంలో భాగంగా ఈరోజు నుంచి తెలంగాణలోని యావత్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తు పథకాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆర్డినరీ బస్సులతో పాటు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఈరోజు నుంచి ఉచితం ప్రయాణించేలా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలికలు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లు కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ నిఖత్ కు రూ.2 కోట్లు చెక్ అందించారు. మహిళా మంత్రులు కొండా సరేఖ, సీతక్క, భట్టి విక్రమార్కతో కలిసి చెక్ ను అందజేశారు. వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్ కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించారు.
శాసన సభ ఆవరణలో ఈ పథకాలు ప్రారంభించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు. అలాగే ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతకుమారితోపాటు పలువురు పాల్గొన్నారు.