సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి దేశ్ పాండే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం
తెలంగాణ బీజేపీలో టికెట్ల కేటాయింపు విషయంలో అలజడి మొదలైంది. టికెట్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు అభ్యర్థుల పేర్లు, నియోజకవర్గ స్థానాలను మార్చుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ప్రకటించిన బీజేపీ తుది జాబితా కలకలం రేపుతోంది. ఇప్పటికే రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన బీజేపీ తాజాగా మరో స్థానంలో అభ్యర్థిని మార్చింది. సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి కేటాయింపు విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇవాళ ఉదయం సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా దేశ్ పాండే పేరు ప్రకటించింది. దేశ్ పాండే నామినేషన్ కు బయలుదేరుతుండగా అనూహ్యంగా సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పులిమామిడి రాజుకు బీ ఫారం ఇచ్చింది. దీంతో రిటర్నింగ్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ్ పాండే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కిషన్ రెడ్డి కి ఫోన్ చేసి దుఃఖంతో తన ఆవేదనను వెలిబుచ్చారు.
బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం(నవంబర్ 10)న విడుదల చేసిన ప్రకటనలో బెల్లంపల్లి నుంచి ఎమాజీ పేరు వచ్చింది కానీ, ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా అమరజుల శ్రీదేవి కొనసాగుతారని పేర్కొన్నారు.









