బీఆర్ఎస్ పార్టీపై.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే మల్లన్నకు సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో.. ఆయన మాటలకు, ప్రభుత్వాన్ని నిలదీసే విధానాన్ని ఈ ఎన్నికల్లో వాడుకునేందుకు కాంగ్రెస్ పెద్ద ప్లానే వేసింది. పార్టీలో చేరిన తెల్లారే.. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించింది.
అయితే.. ప్రచార కమిటీ ఛైర్మన్గా ఉన్న మధుయాష్కీ గౌడ్.. ఎల్బీనగర్ బరిలో ఉండటంతో.. క్యాపెయినింగ్కు సంబంధించిన వ్యవహారాలను ఇప్పుడు మల్లన్న చూసుకోనున్నాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మాటల తూటలతో ప్రత్యర్థులను బహిరంగ సభలలో నిలదీస్తుండగా.. ఆయనకు మల్లన్న తోడవటంతో కాంగ్రెస్ ప్రచారం మరో స్థాయికి చేరనుదని శ్రేణులు భావిస్తున్నాయి. కన్వీనర్గా నియమిస్తూ వెల్లడించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొనగా.. ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నామినేషన్లకు రేపు ఒక్కరోజే సమయం ఉండటంతో.. ఆ పర్వం పూర్తయిన వెంటనే ప్రచార ప్రక్రియను వేగవంతం చేసేలా ప్లాన్ చేయనున్నారు.
అయితే.. ఇప్పటికే రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ ఈ నెల 15 తర్వాత తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారం చేయనున్న నేపథ్యంలో.. అటు అభ్యర్థులు, శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారా కార్యక్రమాలను ఖరాలు చేయనున్నారు. మరోవైపు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఆ రెండింటిపై దృష్టి పెడుతూనే మిగితా అభ్యర్థుల ప్రచారానికి కూడా హాజరవుతున్నారు. ఇక.. తీన్మార్ మల్లన్న కూడా తోడవటంతో ఆయా సభల్లో.. మల్లన్నను కూడా గట్టిగా వాడనున్నట్టు తెలుస్తోంది.









