టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలిసిందే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడిన అది వైరల్ అవుతుంది. తాజాగా సమంత తన పెళ్లివిడాకులపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గత రెండేళ్లుగా సమంత ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి తెలిసిందే. ఓవైపు ప్రేమ, పెళ్లి విఫలం కావడంతో మానసిక సంఘర్షణ.. మరోవైపు మయోసైటిస్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడింది. సినిమా చిత్రీకరణకు బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత కాస్త కోలుకోగానే ఖుషి, సిటాడెల్ చిత్రాలను పూర్తి చేసింది. ఖుషి సినిమా షూటింగ్ సమయంలోనే మరోసారి మయోసైటిస్ సమస్య వేధించడంతో ఈ మూవీ విడుదలకు ముందే చికిత్స కోసం విదేశాలకు వెళ్లిపోయింది. కొన్ని నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె భూటాన్లో మయోసైటిస్ చికిత్స కోసం సిద్ధమవుతుంది. అక్కడ హాట్స్టోన్ బాత్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా హర్పర్ బజార్ అనే ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది సామ్. జీవితంలో ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయని.. పెళ్లి విఫలమవ్వడం.. ఆరోగ్య సమస్యలు.. సినిమాలు ప్లాప్ కావడం తనను ఎంతో ఇబ్బందికి గురిచేశాయని చెప్పుకొచ్చింది.









