మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు తాను హాజరుకావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాదు, తనకు జారీ చేసిన సమన్లు వాపస్ తీసుకోవాలని ఆయన ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో చట్టవిరుద్ధంగా జారీ చేసిన నోటీసులుగా కేజ్రీవాల్ అభివర్ణించారు. బీజేపీ ప్రోద్బలంతోనే సమన్లు పంపారని ఆరోపించారు. నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆప్ అధినేత డిమాండ్ చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు ఢిల్లీ సీఎం హాజరుకావాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయం ఆప్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. తుగ్లక్ రోడ్డులోని ఈడీ ఆఫీసు వద్ద పలు వరుసల్లో బారీకేడ్లను ఉంచి.. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని బీజేపీ కేంద్రం కార్యాలయం, ఐటీఓ ప్రాంతంలోని ఆప్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు, రాజ్ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు కేజ్రీవాల్ వెళ్లే అవకాశం ఉందనే సమాచారంతో అక్కడ భద్రతను పెంచారు. ఇక, ఈ ఏడాది ఏప్రిల్లో మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఫిబ్రవరిలో అరెస్ట్ కాగా.. ఆయన పలుసార్లు బెయిల్కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఢిల్లీ నూతన మద్యం విధానంలో రూ.338 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారనేది ఈడీ ప్రధాన వాదన. ఢిల్లీ మద్యం విధానం 2021-22ని రూపొందించే క్రమం, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్ అధినేతగా కేజ్రీవాల్ను నిందితులు సంప్రదించారని ఈడీ తన ఛార్జిషీటులో పేర్కొంది.