– నేడు రాహుల్ గాంధీ సమక్షంలో చేరనున్న నేత
– పొంగులేటితో కలిసి ఢిల్లీకి పయనం
భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెటేకాక, కేసీఆర్ అపాయింట్ మెంట్ సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికార పార్టీలో జలగం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలని జలగం నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం టికెట్ ను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో ఆ టికెట్ ను జలగం వెంకట్రావుకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.