రూ.50లకే ఆరు గంటల పాటు ప్రయాణం
ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లు
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రెండు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్లోని బస్ భవన్లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించారు. ఈ టికెట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు.
మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం టి-6 టికెట్ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటి ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6 టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ను బస్సుల్లో కండక్టర్లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6 టికెట్లను మంజూరు చేయరు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు టి-6 టికెట్ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ద్రువీకరణ కోసం వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.
వారంతాలు, సెలువు దినాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ-24 టికెట్ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్కు రూ.300 చెల్లిస్తే.. నలుగురు రోజంతా సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్ తీసుకోవచ్చు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.