బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నియోజకవర్గాల పర్యటనల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 26న నాగర్కర్నూల్కు బదులుగా వనపర్తిలో సభ నిర్వహిస్తారు. ఈనెల 27న గతంలో ప్రకటించిన స్టేషన్ఘన్పూర్కు బదులుగా మహబూబాబాద్, వర్దన్నపేట ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మిగతావన్నీ యథాతథంగా కొనసాగుతాయి. ఈనెల 15న మేనిఫెస్టో ప్రకటించి.. హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున .. ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్… గురువారం నుంచి మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు.
ఈనెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో.. 27న పాలేరు, మహబూబాబాద్, వర్దన్నపేటలో కేసీఆర్ సభలు ఉంటాయి. నవంబరు 8 వరకు కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైంసా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మక్తల్, నారాయణపేట, చెన్నూరు, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ పర్యటించనున్నారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.