కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్కు లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి.. కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని పంపనున్నట్లు చెప్పారు. ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై.. రేపు కాళేశ్వరం డ్యామ్ను సందర్శించనుంది.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయన్నారు. దీంతో బ్యారేజ్లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేస్తున్నారని చెప్పారు. సాగునీటికోసం జమచేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదలాల్సి వచ్చిందన్నారు. దీని కారణంగా దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంగా భయంభయంగా గడిపారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై ఎదరువతున్న ప్రశ్నలకు సమాధానంగా.. దయచేసి కేంద్రబృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించగాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.