చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ.. సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్దాయనను.. బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, కుట్ర పూరితంగా జైల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. ఇన్ని రోజులపాటు చంద్రబాబును జైల్లో నిర్బంధించడం దారుణమన్నారు. 2021లో కేసు నమోదు అయితే.. దానికి సంబంధించిన వాళ్లంతా బెయిల్ మీద బయటకొచ్చారు. కానీ 44 రోజులైనా చంద్రబాబుకు బెయిల్ ఎందుకు రావడం లేదు..? ఇదంతా కుట్ర కాదా..? అని మోత్కుపల్లి ప్రశ్నించారు. కుట్రతో చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేసి ఆయన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మోత్కుపల్లి సంచలన ఆరోపణలు చేశారు.
‘తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉంది కేసీఆర్ అన్నా.. ఈ అరెస్ట్లో మీకు భాగస్వామ్యం లేదని నిరూపించుకోవాలంటే… మీరు ఇప్పటికైనా కళ్లు తెరిచి చంద్రబాబు అరెస్ట్ను ఖండించాలి. లేదంటే ఈ 30 సీట్లలో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాతే కాంగ్రెెస్ పార్టీ బలపడిందన్నారు. రేవంత్ సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ఓటు చీలకుండా ఉంటే.. కేసీఆర్ పార్టీ ఓడే అవకాశం ఉందన్న మోత్కుపల్లి.. ఓట్లు చీలకుండా ఉండటం కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా పని చేయాలన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న మోత్కుుపల్లి.. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ తనను బీఆర్ఎస్లోకి పిలిచి అవమానించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కూడా సరిగా లేదని ఈ మధ్య అంటున్నారన్న మోత్కుపల్లి.. ఆయన ఏ ఒక్క పథకం అమల్లోనూ సరిగా సఫలం కాలేకపోయారన్నారు. ఏ పథకం తీసుకున్నా ఇదే పరిస్థితి ఉందన్నారు.
దళిత బంధు ఒక్కటి ఇస్తే.. నా జాతి సంతోషడుతుందని అనుకున్నా.. కానీ దాన్ని కేసీఆర్ నీరుగార్చారని మోత్కుుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను, బడుగు వర్గాలను కేసీఆర్ అవమానించారన్నారు. రైతు రుణమాఫీని సక్రమంగా చేయలేకపోయారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఒక్కసారి కేసీఆర్ కుర్చీ దిగితే ప్రజలు దగ్గరకు వస్తారన్న మోత్కుపల్లి.. ఇప్పుడు ఆయన వినే పరిస్థితి లేదన్నారు.
‘ఓ స్థాయి ఉన్న నాకే కేసీఆర్ను కలిసి రెండు నిమిషాలు మాట్లాడే పరిస్థితి లేదు.. ఆయన ఎందుకు అలా మారారో.. ఆ దేవుడికే తెలియాలి. పదేళ్లు ఆయన సీఎంగా ఉన్నారు, చాలు. ఒక అవకాశం సోనియా గాంధీకి ఇవ్వాలి’ అని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. 25-30 మంది అభ్యర్థులను మార్చుకోవాలని తాను కేసీఆర్కు సూచించాన్నారు. ప్రజలు కేసీఆర్ డబ్బులు తీసుకొని.. బీఆర్ఎస్కు ఓటేయకుండా, కాంగ్రెస్కు ఓటేస్తారన్నారు. దళితులను ప్రోత్సహించింది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు.