AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదరగొట్టిన విరాట్, షమీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్

వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో ఊపు మీద ఉన్న న్యూజిలాండ్ జట్టును రోహిత్‌ నేతృత్వంలోని టీమిండియా.. ఈ మెగా టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపింది. గత మ్యాచ్‌లాగే విరాట్‌ కోహ్లీ జట్టును ముందుండి గెలిపించాడు. అయితే సెంచరీకి 5 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. అయితే అప్పటికే జట్టు విజయం ఖరారైంది. మరో రెండు ఓవర్లు ఉండగానే కివీస్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో సరిగ్గా 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 300ల పైచిలుకు స్కోరు చేసేలా కనిపించిన కివీస్‌.. చివర్లో తడబడింది. డేరిల్‌ మిచెల్ 127 బంతుల్లో 130 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో రాణించాడు. కుల్‌దీప్ యాదవ్ 2, సిరాజ్, బుమ్రా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

ఇక 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో రోహిత్‌ శర్మ (46), శుభ్‌మన్‌ గిల్‌ (26) ఔట్‌ అయ్యారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలబడ్డాడు. జట్టును ముందుండి నడిపించాడు. విజయానికి 5 పరుగులు అవసరం అయిన దశలో విరాట్‌ కోహ్లీ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. గత మ్యాచ్‌లో లాగే సెంచరీతో కోహ్లీ జట్టుకు విజయాన్ని అందిస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా క్యాచ్‌ ఇచ్చి 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔట్‌ అయ్యాడు.

ఇక కోహ్లీ సెంచరీ మిస్‌ అయినా.. భారత్ మాత్రం విజయం సాధించింది. రవీంద్ర జడేజా 39 పరుగులతే అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మరో రెండు ఓవర్లు ఉండగానే టీమిండియా విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ ఫలితంతో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ భారత్‌ గెలిచినట్లయింది. ఇక న్యూజిలాండ్‌ ఈ టోర్నీలో తొలి ఓటమిని రుచి చూసింది. 2003 తర్వాత వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడించిన కివీస్‌పై భారత్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. కోహ్లి, షమీ రాణించడంతో భారత్‌కు ఈ దసరా మరింత ఆనందాన్ని ఇచ్చింది.

ANN TOP 10