దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని..ఈడీ, సీబీఐ,ఐటీ వంటి వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించారని.. ఈ సమయంలో కవితకు నోటీసులు జారీ చేయడం కక్ష్యసాధింపు చర్యేనని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారన్నారు.కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ గా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేయిస్తుందని, మరి బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని, వారందరూ నీతిమంతులేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచరని స్పష్టం చేశారు.
