– రాయి ఏదో రత్నమేదో గుర్తించాలి
– అభివృద్ధిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచాం
– 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు ఈ సభే నాంది కావాలి
– హుస్నాబాద్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
అనతికాలంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిపామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచిందని గుర్తుచేశారు. ఎన్నికల రాగానే అనేక పార్టీలు వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇయ్యమని అడుతారని ఎద్దేవా చేశారు. ఓటు వేసేముందు బాగా ఆలోచన చేయాలన్నారు. మన భవిష్యత్ ను మార్చేది ఓటు, అందుకే జాగ్రత్తగా మనకు ఎవరు బాగు చేస్తారు? అనే విషయాలను ఆలోచన చేసి ఓటు వేయాలని సీఎం ప్రజలకు సూచించారు.
చెప్పని హామీలు సైతం..
ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద్దని, ఓటు మన తలరాతలను మారుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని చెప్పారు. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే గెలిచేది ప్రజలేనని అన్నారు. గడిచిన 9 ఏళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని చాలా హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమలు చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఇలాగే కొనసాగాలన్నారు. కొన్ని పార్టీలు ఒక్క ఛాన్స్ అంటున్నాయని, 60ఏళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నించారు.
గౌరవెల్లి బాధ్యత నాది..
గౌరవెల్లి ప్రాజెక్టును నేనే బాధ్యత తీసుకుంటానని, ఎన్నికలు అయిపోయాక తానే స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు.కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో సతీష్ బాబును గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఇదే సభలో సతీష్ బాబుకు బీఫామ్ అందించారు. బీఆర్ఎస్ 95 నుంచి 105సీట్లు గెలవడానికి హుస్నాబాద్ సభ నాంది కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.