AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ టీఆర్‌టీ వాయిదా.. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారంటే..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) శుక్రవారం (అక్టోబర్‌ 13) వాయిదా పడింది. ఎన్నికలు కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి కొత్త పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా మొత్తం 5,089 ఉపాధ్యాయ కొలువులకు నవంబర్‌ 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో నియామక పరీక్షలు జరగాల్సి ఉంది. అదే నెల 30వ తేదీన పోలింగ్‌ ఉండటంతో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యంగా అధికారులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్‌ పరీక్షలైనందున నవంబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్‌జీటీ పరీక్షల వరకు వాయిదా వేయాలని విద్యాశాఖ తొలుత భావించింది. ఆన్‌లైన్‌ పరీక్షలు అయినందున పూర్తిగా వాయిదా వేసేది లేదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు కూడా. ఈ క్రమంలో తాజాగా కొందరు అభ్యర్థులు టీఆర్‌టీ మొత్తం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. దీంతో తెలంగాణ డీఎస్సీ (టీఆర్టీ) పరీక్షలను వాయిదా వేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన నేటి సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ టీఆర్‌టీ ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత టీసీఎస్‌ అయాన్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి ప్రవేశ, ఉద్యోగ పరీక్షలను నిర్వహిస్తోన్న టీసీఎస్‌ సంస్థ రాష్ట్ర ఉపాధ్యాయ కొలువుల నియాక ప్రక్రియ బాధ్యతలను చేపట్టింది. డిసెంబరు, జనవరిలో పలు జాతీయస్థాయి పరీక్షలు ఉన్నాయని ముందుగానే ఆ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖకు చెప్పినందున నవంబర్‌లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా పడితే మళ్లీ ఫిబ్రవరిలోనే స్లాట్లు దొరుకుతాయని ఆ సంస్థ సెప్టెంబరులోనే స్పష్టం చేసినట్లు సమాచారం.

ANN TOP 10