అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రగతిభవన్ నుంచి కేసీఆర్ మూడు డబ్బుల సంచులు పంపినట్లు తనకు సమాచారమందిందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రగతి భవన్ నుంచి ఒక మూట పంపితే కొల్లాపూర్కు మాత్రం కేసీఆర్ మూడు డబ్బుల సంచులు పంపినట్లు తనకు విశ్వసనీయ సమాచారమందిందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జూపల్లి అన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికల కోడ్ వచ్చినా పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, నిధులు లేవు కానీ, సంక్షేమ పథకాలకు మంజూరు కాగితాలు ఇస్తున్నారని, గడిచిన ఐదు సంవత్సరాలలో చేయని అభివృద్ధి ఎన్నికల కోడ్ పడ్డ తర్వాత ఎలా చేస్తారని జూపల్లి ప్రశ్నించారు. ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్లినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల బండారం బయటపెడతానన్నారు.