AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాంలో స్కాం జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు పేరును కూడా చేర్చింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ నమోదు చేయగా బుధవారం ఉదయం విచారణ జరిగింది. ఇటు చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలు.. అటు సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. దీంతో చంద్రబాబుకు కొంత ఊరట దక్కినట్లు అయ్యింది. ఏపీ హైకోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు కూడా కొంచెం ఉపశమనం దక్కినట్లు భావిస్తున్నాయి.

మరోవైపు ఈ కేసులో దర్యాప్తు అధికారిని మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టుకు సమాచారం అందించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్ధతో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు లబ్ది జరిగినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసును ప్రస్తుతం అదనపు ఎస్పీ జయరామరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన స్ధానంలో డీఎస్పీ విజయ్ భాస్కర్‌ను నియమిస్తూ సీఐడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.

ANN TOP 10