AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాపై దాడి చేసి రక్తం చూస్తే.. ఆ రక్తాన్ని సిరగా మార్చి చరిత్ర రాస్తా: గవర్నర్ తమిళిసై

తెలంగాణలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లు ఉంటుంది. ఎదో ఓ అంశంపై ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఇటీవల ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలోనూ అదే జరిగింది. గవర్నర్ ఎమ్మెల్సీ సిఫార్సులను తిరస్కరించగా.. అధికార పార్టీ నేతలు గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా.. గవర్నర్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. సభలో మట్లాడిన గవర్నర్.. సంచలన కామెంట్సే చేశారు.

‘నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారు కూడా ఉన్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే.. ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా.’ అని తమిళిసై అన్నారు. అయితే.. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలని ఎలాంటి అవమానాలు పట్టించుకోనని ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.

లోక్‌సభ, శాసనసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం ఆనందంగా ఉందని అన్నారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయటం హర్షణీయమన్నారు. తాను ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్‌ అని తమిళిసై పేర్కొన్నారు. రాజకీయాలపై ఇష్టంతోనే వైద్యవృత్తిని పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. తాను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. ఆ తర్వాత ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రోటోకాల్‌ ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసుకుంటూ పోతానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.

ANN TOP 10