మణిపూర్లో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్యకు నిరసనలో భాగంగా ఆందోళనకారులు తౌబాల్ జిల్లాలోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. దీంతో పాటు ఇంఫాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శారదాదేవి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. రాజధాని ఇంఫాల్తో సహా అనేక చోట్ల నిరసనకారులు మరియు భద్రతా దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలకు సంబంధించి 1697 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని మోయిరాంగ్ఖోమ్లో ఆందోళనకారులను నియంత్రించడానికి భద్రతా బలగాలు పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
పెల్లెట్ తలలోకి చొచ్చుకుపోవడంతో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజులుగా ఇంఫాల్ లోయలో జరిగిన నిరసనల్లో 50 మంది గాయపడ్డారు. ఓ ప్రాంతంలో పోలీసు వాహనాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విద్యార్థి హత్య కేసును విచారించేందుకు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ ఇంఫాల్ చేరుకున్నారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో AFSPAను పొడిగించిన సంగతి విదితమే. అక్టోబర్ 1 నుంచి ఆరు నెలల పాటు ఇది అమలులో ఉండనుంది.