తెలంగాణ ఎన్నికల ముందు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ పార్టీని వీడనున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు బాపురావు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రాథోడ్ బాపురావు పేరు లేదు. బోథ్ నుంచి అనిల్ జాదవ్కు టికెట్ కేటాయింపు పట్ల రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ రాథోడ్ బాపురావుపై మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు.
మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోరారు రాథోడ్ బాపురావు. కేటీఆర్ స్పందించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను వీడబోనని నెల రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు మరో పదవి ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.