వరుస ట్రైన్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా రైల్వేశాఖలో మాత్రం కదలిక రావటం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తూ.. తప్పిదాలు చేస్తున్నారు. తాజాగా.. కాచిగూడలో ఆగాల్సిన స్పెషల్ ట్రైన్ అక్కడ ఆగకుండానే వెళ్లిపోయింది. మరో స్టేషన్ సీతాఫల్ మండిలో ట్రైన్ ఆగింది. దీంతో అందులో ప్రయాణించిన వారు షాక్కు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం కాచిగూడ-యశ్వంత్పుర్ వందేభారత్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్రీయ విద్యాలయం, రైల్వే పాఠశాలల విద్యార్థులను, జర్నిలిస్టులను, రైల్వే అధికారులు సహా ఎంపిక చేసిన మరికొందరిని మహబూబ్నగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ వారు దిగాక తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక ట్రైన్ను ఏర్పాటు చేశారు. ఆ ట్రైన్ కాచిగూడలో వారందిరిని దించాలి. కానీ ఆ ట్రైన్ కాచిగూడలో ఆగలేదు. స్టేషన్ దాటాక రెడ్సిగ్నల్ పడడంతో అరనిమిషం ఆగింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో సీతాఫల్మండికి వెళ్లి అక్కడ నిలిచిపోయింది.
దీంతో ఆ ట్రైన్లో ఉన్నవారంతా ప్లాట్ఫాంపై పడిగాపులు కాశారు. స్కూల్ టీచర్లు విద్యార్థుల్ని ట్రైన్ నుంచి కిందికు దింపి కాచిగూడ స్టేషన్లో ఉన్న తమ బస్సుల్ని అక్కడికి రప్పించుకున్నారు. దాదాపు 50 నిమిషాల తర్వాత రైల్వే అధికారులు మరో ప్రత్యేక రైలును మల్కాజిగిరి నుంచి సీతాఫల్మండికి పంపారు. అక్కడ ఉన్నవారిని కాచిగూడ స్టేషన్కు చేరవేశారు. ఈ పరిణామానికి రైల్వే అధికారులు కూడా షాక్కు గురయ్యారు. చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి తప్పిదాన్ని చూడలేదని ఓ అధికారి వ్యాఖ్యానించడం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.