ఓ నియంతలా వ్యవహరిస్తున్న జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమని బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఆయన పెళ్లి రోజే అరెస్టు చేసి రాక్షసానందం పొందారంటూ మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు కనీస మానవత్వం లేదంటూ మండిపడ్డారు. కక్ష సాధింపునకూ ఓ పద్దతి ఉంటుందని, జగన్ లా దుర్మార్గంగా వ్యవహరించిన వారిని తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు తప్పు చేయడని పేర్కొన్నారు. ముష్టి రూ. 371 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటంలేదని అన్నారు. అలాంటి నేత అరెస్టు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి నియంత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే నష్టపోయేది జగనేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు కాదు కదా 4 సీట్లు కూడా రావని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. నారా భువనేశ్వరిని కన్నీళ్లు పెట్టించారని, ఆమె ఉసురు జగన్ కు తప్పకుండా తగులుతుందని అన్నారు.