హైదరాబాద్- బెంగళూరు మధ్య ప్రయాణాలు సాగించేవారికి గుడ్న్యూస్. నేడు ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్ ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఇవాళ ఒకేసారి 9 వందే భారత్ ఎక్స్ప్రైస్ ట్రైన్లను వర్చువల్గా ప్రారంభిస్తుండగా.. అందులో కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్పుర్ (బెంగళూరు) ట్రైన్ కూడా ఉంది. ఈ ట్రైన్ ఏపీ మీదుగా కర్ణాటకకు వెళ్లనుంది. అంటే మూడు రాష్ట్రాలను ఈ ట్రైన్ కలపనుంది. నేడు ప్రారంభం కానున్న ట్రైన్.. రేపటి నుంచి (సెప్టెంబర్ 25) ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
కాచిగూడ-యశ్వంత్పుర్ వందేభారత్లో 8 కోచ్లు ఉంటాయి. రైలులో 530 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. టికెట్ల బుకింగ్ సదుపాయం ప్రారంభం కాగా.. ఒక ప్రయాణికుడికి క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి- ఏసీ ఛైర్కార్ ధర రూ.1,600గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ టికెట్ ధర రూ.2,915 గా ఉంది. క్యాటరింగ్ వద్దనుకుంటే ఏసీ ఛైర్ కార్ టికెట్ రూ.1,255, ఎగ్జిక్యూటివ్ టికెట్ రూ.2,515గా నిర్ణయించారు.
ఈ రెండు నగరాల మధ్యదూరం 610 కి.మీ దూరం కాగా ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్పుర్ వందేభారత్ మార్గం మధ్యలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడలో ఉదయం 5.30కి ట్రైన్ బయల్దేరుతుంది. మహబూబ్నగర్ 6.49 గంటలకు, కర్నూలు 8.24 గంటలకు, అనంతపురం 10.44 గంటలకు, ధర్మవరం 11.14 గంటలకు, యశ్వంత్పుర్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. బుధవారం మినహా వారంలో 6 రోజులు ఈ వందేభారత్ సేవలు అందుబాటులో ఉంటాయి. సెలవు రోజును రైలు నిర్వహణకు వినియోగిస్తారు. కాచిగూడ స్టేషన్లో జరిగే ట్రైన్ ప్రారంభం కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులకు ఆహ్వానాలు పంపినట్లు రైల్వే అధికారులు తెలిపారు.