కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకం సృష్టించింది. ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్తో పాటు హీరో రవితేజ, నవదీప్ సహా పలువురిని పలువురిని పోలీసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఈ ఇష్యూపై పెద్ద దుమారమే రేగింది. ఇప్పటికే ఈ కేసులో హీరో నవదీప్కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో హీరో నవదీప్కు సంబంధం ఉందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా నవదీప్కు డ్రగ్స్ డీలర్స్తో సంబంధం ఉందని తేల్చారు. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఈ కేసులో నవదీప్ మేనేజర్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మరోవైపు ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరకొండ సురేష్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఈ విషయమై నవదీప్ మాట్లాడుతూ.. తాను ఎక్కడికి పారిపోలేదని.. అంతేకాదు తన ఫోన్లను స్విచ్చాఫ్ చేయలేదని మీడియాకు చెప్పారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. మరోవైపు నవదీప్ను అరెస్ట్ చేయోద్దంటూ తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నార్కొటిక్స్ పోలీసులు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను లై డిటెక్టర్ పరీక్షలు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసులో నవదీప్ను పోలీసులు డ్రగ్స్ వినియోగదారుడిగా చేర్చారు. డ్రగ్స్ విక్రేత రామ్చందర్తో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఇక నవదీప్ ద్వారానే సినీ పరిశ్రమలో ప్రముఖుల దగ్గరకు డ్రగ్స్ చేరాయనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నవదీప్ను 37వ నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే నార్కొటిక్స్ పోలీసులు నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నవదీప్కు అక్కడ చుక్కెదురైంది. అంతేకాదు పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే విషయమై పోలీసులు నవదీప్ను ప్రశ్నిస్తున్నారు.