AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతాం.. రేవంత్

నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ స్లోగన్ అని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని ఆయన చెప్పారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీడబ్యూసీ(CWC) సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ కాంగ్రెస్ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో సీడబ్యూసీ సమావేశాలు జరిగాయని చెప్పారు.‘‘ నేను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరబాద్‌లో సీడబ్యూసీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది.

ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చించాం. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి పాత్రపై కూడా చర్చ జరిగింది. వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. మరో వంద రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజే 6 గ్యారెంటీ స్కీమ్‌ల అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా సోనియా గాందీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. సోనియాని గౌరవంగా స్వాగతించి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విజ్ఞత ఉన్నట్టు అనిపించేది. బంట్రోతులు అందరూ చొక్కాలు చించుకుంటున్నారు.’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము మీటింగ్ పెట్టుకోగానే ఇంట్లో పండుకున్న బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఏకమై కుట్రలు చేశాయని ఆరోపించారు. తమ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం తన స్వప్నం అని సోనియా అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పామని, అదే సానుకూల కోణంలో ప్రజల దగ్గరికి వెళ్తామని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూసి నిర్ణయం మీరే తీసుకోవాలని ప్రజలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాలని గమనించాలని రేవంత్ రెడ్డి చెప్పారు.

ANN TOP 10